20-08-2025 01:41:13 AM
గజ్వేల్: విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న పంటలన్నీ పండే భూములు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, భవిష్యత్తు వ్యవసాయనిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు లోని తెలంగాణ రాష్ట్ర కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో భోజనశాలను ప్రారంభించడంతోపాటు విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యాన ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించడానికి విశ్వవిద్యాలయం అధునాతన, అవసరాల ఆధారిత పరిశోధనలపై దృష్టి పెట్టాలని, తద్వారా ఇతర రాష్ట్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆయన నొక్కి చెప్పారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, ఉద్యాన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా ఎక్కువ శాతం పొలాలలో రైతులు చేసే శ్రమను పరిశీలించి వారి శ్రమను తగ్గించడానికి ఏం చేయాలో ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. విదేశాల నుంచి దేశం దిగుమతి చేసుకుంటున్న ఎన్నో పంటలు పండించే భూములు రాష్ట్రంలో ఉన్నాయని, రైతులు ఆయా పంటలు సాగు చేసే విధంగా యూనివర్సిటీలు అవగాహన కల్పించాలన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను అశ్వరావుపేట కళాశాలను సందర్శింపజేసి మా ప్రాంతంలో పంటలపై అవగాహన పెంపొందించాలన్నారు.
రైతులు సుగంధ ద్రవ్యాల పంటలను పండించేలా అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఉద్యాన గ్రాడ్యుయేట్లకు విభిన్న పరిశ్రమలలో విస్తృత కెరీర్ అవకాశాలు ఉన్నాయని మరియు పరిమిత మార్గాలకే పరిమితం కాకూడదని కూడా ఆయన నొక్కి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (ఎపిసి) ఎం. రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇప్పుడు ఉద్యాన పై దృష్టి సారిస్తున్నందున విస్తృత అవకాశాలను అన్వేషించాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తన వ్యాఖ్యలలో విద్యార్థులు ఎక్కువ క్షేత్ర అనుభవాన్ని పొందాలని, రైతులతో చురుకుగా సంభాషించి సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలన్నారు.
రైతుల నుండి ఆచరణాత్మక జ్ఞానాన్ని నేర్చుకోవాలని నొక్కి చెప్పారు. ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయడం భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనదని, ఇది రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజిరెడ్డి ఆహ్వానించగా, సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.హైమావతి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ బోర్డు సభ్యురాలు భవానీ తదితరులు హాజరయ్యారు.