08-10-2025 12:59:52 AM
బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం
వేములవాడ టౌన్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి)సుప్రీంకోర్టులో కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై సోమవారం ఓ లాయర్ డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించడం రాజ్యాంగంపై దాడి అని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. మంగళవారం దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో నిరసన తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజే పై దాడికి యత్నించిన లాయర్ పై జీవితకాల నిషేధం విధించాలని, భారత రాజ్యాంగ రక్షకుడైన చీఫ్ జస్టిస్ పై దాడిపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కట్కం జనార్దన్, క్రీడల కార్యదర్శి మనోహర్,నాగుల సత్యనారాయణ ,విద్యాసాగర్ రావు,దేవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.