23-01-2026 10:57:18 AM
రోడ్డు భద్రతపై అవగాహన
బిక్కనూర్,జనవరి 23( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోని ఎంఎస్ఎన్ కంపెనీలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాజాత బృందం పాల్గొని ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించింది. కళాజాత బృందం సభ్యులు తిరుపతి, శేషారావు, సాయిలు పాటలు, నాటికల రూపంలో రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎస్ ఎన్ హెచ్ ఆర్ బ్రహ్మానందం, కెప్టెన్ రమేష్,ఉద్యోగులు పాల్గొని అరైవ్–అలైవ్ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలిపారు.