calender_icon.png 18 June, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్దుతండా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగ ప్రాముఖ్యతపై అవగాహన

17-06-2025 07:01:52 PM

టేకులపల్లి (విజయక్రాంతి): ప్రపంచ యోగా దినోత్సవాల్లో(International Yoga Day) భాగంగా మంగళవారం టేకులపల్లి మండలం బద్దుతండాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(Eklavya Model Residential Schools)లో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి యోగా ప్రాముఖ్యతపై విద్యా బోధన చేసి వారిచే యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయుష్ వైద్యాధికారిణి విజయశ్రీ మాట్లాడుతూ.. ప్రాచీన యోగా భారతీయుల అమూల్య సంపద అని దీనిలోని విశేషమైన ఆరోగ్య రహస్యాలు తెలిసిన ప్రపంచ దేశాలన్నీ దీనిని ఆచరించి లబ్ధి పొందుతున్నాయని, యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మెదడుకు శక్తిని ఇస్తుందని, జీవనక్రియలను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను దూరం చేస్తుందన్నారు.

నిద్రలేమి సమస్యలను దూరం చేసి, ఎముకలను దృఢంగా చేస్తుందని, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుందన్నారు. శ్వాసక్రియను మెరుగుపరిచి శరీరమంతటికి చక్కటి ప్రాణవాయువుతో కూడిన మెరుగైన రక్త ప్రసరణకు తోడ్పడుతుందని ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయ యోగాని ఆచరించి దాని ఫలితాలు అనుభవించి సుఖవంతమైన ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణవ, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, స్టాఫ్ నర్స్ భవాని, వ్యాయామ ఉపాధ్యాయులు రమాదేవి, మహేష్, ఇతర ఉపాధ్యాయ సిబ్బందితో పాటు ఆయుష్ వైద్యాధికారిణి విజయశ్రీ, యోగా శిక్షకురాలు ప్రమీల, ఫార్మసిస్ట్ రజిత, విజయ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ధరణి, స్వప్న, ఆశా కార్యకర్తలు విజయ, కవిత, మంగ తదితరులు పాల్గొన్నారు.