17-06-2025 07:07:11 PM
ఎస్ఐ రాజశేఖర్...
మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని పట్టణ ఎస్సై రాజశేఖర్(SI Rajasekhar) కోరారు. ప్రజల్లో ట్రాఫిక్ చట్టాలపై చైతన్యాన్ని పెంపొందించేందుకు మంగళవారం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల(Singareni School) విద్యార్థులకు పాఠశాల ముందు గల కోల్ బెల్ట్ రహదారిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసుల విధులు, రోడ్డు భద్రతలో వారి పాత్ర, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోతే ఎదురయ్యే ప్రమాదాల గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి, వారికి విద్యార్థుల చేత మామిడి పండ్లు అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాహనదారులలో చైతన్యం వస్తుందని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నవారిని అభినందించడం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.