16-05-2025 11:19:40 PM
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
ఎల్బీనగర్: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంటమాలజీ అధికారులు ఎల్బీనగర్ చౌరస్తా నుంచి చింతలకుంట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పరిసరాల స్వేచ్ఛతతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటి ఎదుట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాపిస్తుందని, దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా ఇంట్లో ఉండే పులా కుండీలు, పాత టైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వఉండకుండా చూసుకోవాలని తెలిపారు. డెంగ్యూ నివారణలో ప్రజలు, ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు అందరూ కలిసి పని చేయలని కోరారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా దోమల నివారణకు ఫాగింగ్ మెషిన్లు, స్ప్రే యంత్రాలతో దోమల నివారణ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరినేత, సింగిరెడ్డి వేణు, సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్లు రాంబాబు, మణి, రవీంద్రనాథ్ రెడ్డి, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ల సూపర్ వైజర్లు, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో...
వరల్డ్ ఇంటర్నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద నుంచి అవగాహన ర్యాలీతో పాటు డెంగ్యూ నివారణకు చంద్రపురి కాలనీ కమిటీ హాల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.