21-05-2025 12:31:28 AM
-హెడ్ టు హెడ్ చాలెంజ్లో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు
- మొదటి రోజు అభిప్రాయాలు పంచుకున్న అమెరికా, కరేబియన్, ఆఫ్రికా పోటీదారులు
- నేడు వేదికపైకి యూరప్, ఆసియా, ఓషియానియా సుందరాంగులు
- తెలంగాణలో నిర్వహించడం ద్వారా మిస్ వరల్డ్ పోటీల విశిష్టత పెరిగింది: సీఈవో జూలియా మోర్లీ
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణలో జరుగుతున్న మిస్వరల్డ్ పోటీ లు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. ఈ పదిరోజుల పాటు చారిత్రక, పర్యాటక ప్రాంతా లు, ప్రఖ్యాత కట్టడాలు, సంస్కృతీ సంప్రదాయాల నెలవైన ప్రాంతాలను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు పోటీల ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
మంగళవారం టీహబ్లో జరిగిన మిస్వరల్డ్ ఫెస్టివల్ హెడ్-టు-హెడ్ చాలెంజ్లో పాల్గొన్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరిట రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు ప్రపంచ సుందరీమణులు మెరుగైన ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామాజిక కార్యక్ర మాలు, వారి దృష్టిని, అభిప్రాయాలను తెలియజేశారు.
మిస్వరల్డ్ పోటీదారులు పిల్లల విద్య, పర్యావరణం, ప్రకృతి, యువతుల మద్దతు, చిన్న సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, టీనేజ్లో వచ్చే మానసిక ఆందోళన, మానసిక ఆరోగ్యం, ధ్రువీకరణ శక్తి, భాషా సంరక్షణ, పిల్లల్లో హింస, సౌరశక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ ఆధారిత హింస, పిల్లలపై లైంగిక వేధింపులు, ప్రత్యేక సమాజాలకు విద్య, ఆర్థిక సంక్షోభం, ఆటిజం, మాదకద్రవ్య వ్యతిరేక విద్య వంటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు, స్థానిక సమస్యలపై మాట్లాడారు.
ఖండాల వారీగా విభజించబడిన ఈ షెడ్యూల్లో మంగళవారం అమెరికా, కరేబియన్, ఆఫ్రికా పోటీదారులు మాట్లాడారు. మే 21న(బుధవారం) యూరప్, ఆసియా, ఓషియానియా ప్రతినిధులు వేదికపైకి రానున్నారని నిర్వాహకులు చెప్పారు. ప్రతీ కంటె స్టెంట్ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పారని, సామాజిక మార్పులపై మాట్లాడరని, దీని ద్వారా వారిలో ఉన్న నిబద్ధతతో కూడిన నాయకత్వ లక్షణాలను ఆవిష్కరించారన్నారు. ప్రపంచ సుందరీమణుల శక్తివంతమైన కథనాలు ఈ అంతర్జాతీయ వేదికకు మరింత శక్తిని ఇచ్చాయని నిర్వాహకులు అన్నారు. తెలంగాణలో ఈ పోటీలను నిర్వహించడం, సంస్కృతిని పరస్పరం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ మాట్లాడుతూ.. హెడ్-టు-హెడ్ చాలెంజ్ ఒక పోటీ కాదని, ధైర్యం, మానవతా దృక్పథం, ప్రపంచం నుంచి తరలివచ్చిన వారి అభిప్రాయాలను తెలుసుకునే మంచి వేదిక అన్నారు. పోటీదారులు ప్రపంచ వేదికపైన తెలియజేసిన అభిప్రాయాల నుంచి తాను చాలా ప్రేరణ పొందానని తెలిపారు. తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల వేడుక విశిష్టత పెరిగిందన్నారు.