21 March, 2026 | 7:44 PM

ఎన్ఐఏ విచారణలో కీలకాంశాలు వెల్లడించిన జ్యోతి మల్హోత్రా

21-05-2025 11:34 AM

న్యూఢిల్లీ: ఎన్ఐఏ అధికారులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra)ను బుధవారం నాడు విచారిస్తున్నారు. ఎన్ఐఏ విచారణలో జ్యోతి మల్హోత్రా కీలక అంశాలు వెల్లడించారు. పాకిస్థాన్ నిఘా అధికారులతో సమావేశమైనట్లు జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారు. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నారని, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి(Pakistan High Commission official) డానిష్‌తో తాను క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నానని వర్గాలు తెలిపాయి.

ఎన్ఐఏ(National Investigation Agency) ఇంటరాగేషన్ రికార్డుల నుండి మీడియాకి ప్రత్యేకంగా లభించిన సమాచారం ప్రకారం, 2023లో పాకిస్తాన్‌కు వెళ్లడానికి వీసా కోసం హైకమిషన్‌ను సందర్శించినప్పుడు తాను డానిష్ అలియాస్ ఎహ్సర్ దార్‌(Ehsan Dar alias Danish)ను మొదటిసారి సంప్రదించానని జ్యోతి చెప్పింది. 26 మంది మృతి చెందిన పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య మే 13న భారతదేశం బహిష్కరించిన దౌత్యవేత్తలలో డానిష్ కూడా ఉన్నాడు. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న జ్యోతి( Jyoti Malhotra)కి ఈ వేదికపై దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. "2023లో, పాకిస్తాన్‌కు వెళ్లడానికి వీసా గురించి విచారించడానికి నేను ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను సందర్శించాను" అని జ్యోతి విచారణ సందర్భంగా చెప్పారు. 

33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ పర్యటన సందర్భంగా, డానిష్ కాంటాక్ట్ అలీ హసన్‌ను కలిశానని, అతను తన బస, ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడని చెప్పారు. అలీ హసన్ తనను పాకిస్తాన్ నిఘా అధికారులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు - షకీర్, రాణా షాబాజ్‌లకు పరిచయం చేశాడని జ్యోతి వెల్లడించినట్లు వర్గాలు తెలిపాయి. అనుమానం రాకుండా ఉండటానికి తన ఫోన్‌లో 'జాట్ రాధావా' అనే మారుపేరుతో షకీర్ నంబర్‌ను సేవ్ చేశానని ఆమె తన విచారణకర్తలకు చెప్పిందని తెలుస్తోంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె వాట్సాప్, స్నాప్‌చాట్,  టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాన్ని కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి.