12-06-2025 01:48:56 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట జూన్ 11 (విజయక్రాంతి) : రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భారతి చట్టమును అమల్లోకి తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో గల రైతు వేదికలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో రైతుల కొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ దరఖాస్తుల స్వీకరణ కేంద్రంను తనిఖీ చేశారు.
తదుపరి ఆయన మాట్లాడుతూ జూన్ 20వ తేదీ వరకు కొనసాగే ఈ రెవెన్యూ సదస్సులలో రైతులు పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంత రైతు వేధికకు పక్కనే ఉన్న కేసారం సెకండ్ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణుల సంఖ్య, బాలింతల సంఖ్య, పిల్లల వివరాలను అంగన్వాడి టీచర్ చింత సుధాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె దవాఖాన ను కలెక్టర్ తేజస్ ఆకస్మికంగా సందర్శించి మందుల రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీల వివరాలు ఏయన్సి రిజిస్టర్లలలొ నమోదు చేశారా లేదా పరిశీలించారు.
అన్ని రకాల మందులకు సంబంధించిన స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె దవాఖానాలోని సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వైద్యసిబ్బంది ప్రజలకు సేవే ధర్మంగా విధులు నిర్వహించాలన్నారు. ముందుగా గ్రామంలోని 24వ నెంబర్ చౌక ధరల దుకాణాన్ని పరిశీలించారు. సన్న బియ్యం పంపిణీ వివరాలను డీలర్ గొర్ల గన్నారెడ్డినీ అడిగి తెలుసుకున్నారు.
షాపులో మొత్తం 735 రేషన్ కార్డులు ఉన్నాయని డీలర్ కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఉన్న 610 రేషన్ దుకాణాలకు 17,577 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కొరకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ఈయన వెంట ఆర్డిఓ వేణుమాధవ్, తాసిల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ శ్రీధర్, పల్లె దవాఖాన సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం ఉపేంద్ర, అధికారుల సిబ్బంది ఉన్నారు.