calender_icon.png 15 June, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం వల్ల నష్టమే ఎక్కువ

12-06-2025 01:47:29 AM

  1. ప్రాజెక్ట్ విషయంలో మాట మార్చిన కేసీఆర్
  2. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ కర్త, కర్మ అంతా తానేనని, ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించిన క్రెడిట్ తనదేనంటూ గొప్పలు చెప్పుకున్న మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మాటమార్చి, తప్పించుకొనేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మంచైనా, చెడైనా దానికి పూర్తి బాధ్యత కేసీఆరే వహించాలని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో క్యాబినెట్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే క్యాబినెట్ అనేలా పరిస్థితి ఉండేదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి ఉందని ఈటల చెప్పారన్నారు. కేసీఆర్ గురించి కమిషన్ అడిగితే ఈటల పూర్తి వివరాలు చెప్పేవారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గనుక పనిచేస్తే పంపులకు విద్యుత్ బిల్లులు చెల్లించలేక రాష్ట్రం నాశనమయ్యేదన్నారు.

ప్రాజెక్టు కుంగిపోయినా, ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోయినా ఈ ఏడాది ఎక్కువ వరి పండిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో 2.8 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అయ్యిందని... కానీ కాళేశ్వరం పనిచేస్తున్నప్పుడు కేవలం 2 కోట్ల టన్నుల వరి మాత్రమే ఉత్పత్తి అయ్యిందని తెలిపారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక అనేక సాంకేతిక లోపాలున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయ వేదికగానే త్రీడీ మోడల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నారు.