11-12-2025 01:55:45 AM
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాసికి జాతీయస్థాయి గుర్తింపు
మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్స్ ను పార్టీ జాతీయ ప్రధాన కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి భూక్య శోభన్ బాబు ను నేషనల్ కోఆర్డినేటర్గా నియమించారు. శోభన్ బాబు గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు.
ఉన్నత విద్యావంతుడైన శోభన్ బాబు ఇనుగుర్తిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీఈ పూర్తి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఎంఈ పూర్తి చేశారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఈడీపీ) పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటిలో ఎల్ఎల్బీ చేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వరంగల్, మహబూబాబాద్, నెల్లూరులో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు వార్ రూంలో పనిచేశారు. నాగార్జున సాగర్లో నిర్వహించిన కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణ కార్యక్రమంలో సపోర్ట్ టీం మెంబర్గా పనిచేశారు. ట్రైబల్ హబ్ను ఏర్పాటు చేశారు. ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
భూక్య శోభన్ బాబు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పనిచేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్లో 7ఏఎం సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్నారు. తనకు కాంగ్రెస్పార్టీ ఆదివాసి నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జార్ఖండ్ ఇంఛార్జి కొప్పుల రాజు, ఆదివాసి విభాగం చైర్మన్ విక్రాంత్ భూరియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.