07-06-2025 12:00:00 AM
ప్రస్తుతం తెలుగు చిత్రసీమ లో నెలకొన్న థియేటర్ల సమస్య గురించి నిర్మాత బన్నీ వాసు స్పందించారు. పర్సెంటేజీ విధా నం గురించి మాట్లాడటం కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలోనని ఆలోచించాలంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది. “ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్స్ కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని! ఇప్పుడున్న అర్ధ రూపాయిలో నీది పావులా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలి.
సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతపడతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండేళ్లకో, మూడేళ్లకో ఒక సినిమా చేస్తూ ఉంటే థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతారు.
చాలా మంది ఓనర్స్ థియేటర్స్ మెయింటైన్ చేయలేక మూసేస్తారు. అప్పుడు ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి. కాబట్టి పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళుతుంది” అని తన పోస్ట్లో రాసుకొచ్చారు.