06-10-2025 12:00:00 AM
ఖమ్మం, అక్టోబర్ 05 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించి, ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మండల, జిల్లా నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమవుతోంది. ఆ నిధుల విలువను ప్రజలకు తెలియజేయండి అని పిలుపునిచ్చారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరేయడం లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. గ్రామీణ ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ ఆధిపత్యం సాధించాలి. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి శ్రమతోనే విజయం సాధ్యమని తెలిపారు.
పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో బూత్ వారీగా కార్యకర్తలను సమన్వయం చేయండి.ఇవి రమేష్ కన్వీనర్ గా నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ నేతలు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, సన్నీ ఉదయ ప్రతాప్, మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్ , పుల్లారావు యాదవ్, డాక్టర్ శీలం పాపారావు నంబూరి రామలింగేశ్వరరావు, వీరెల్లి రాజేష్, వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.