06-10-2025 12:00:00 AM
నల్ల బ్యాడ్జీలతో బీజేపీ శ్రేణుల నిరసన ర్యాలీ
ఎల్బీనగర్, అక్టోబర్ 5 : బస్ చార్జీల పెంపుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసిందని, పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆదివారం టీకేఆర్ కాలేజీ నుంచి నందనవనం లక్కీ హోటల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి సామ రంగారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బస్ చార్జీల పెంపు నిర్ణయం భాగ్యనగర ప్రజలకు దసరా ఆనందాన్ని దూరం చేసిందన్నారు. అక్టోబర్ 6 నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రతి స్టేజ్కు రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రయాణికులు, విద్యార్థులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. భాగ్యనగరంలో దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తారని, చార్జీల పెంపుతో ప్రతి ప్రయాణికుడికి నెలకు రూ, 600 నుంచి రూ,1000 వరకు అదనపు భారం పడుతుందని తెలిపారు.
చార్జీల పెంపు కారణంగా భాగ్యనగరం ప్రజలపై నెలకు దాదాపు రూ, 70 కోట్ల భారం, సంవత్సరానికి సుమారు రూ, 800 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలపై అదనపు చార్జీలు వేయడం సిగ్గుచేటు చర్యగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పూర్తి చేసుకుంటున్నా... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించా రని విమర్శించారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లో విలీనం చేయడం జరగలేదని, 43 వేల మంది ఉద్యోగులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందలేదని, పిఆర్సీ బకాయిలు చెల్లించలేదని, వేలాది మెడికల్ బిల్లులు పెండింగులో ఉన్నాయని, ఉద్యోగులు రిటైర్ అయినా పూర్తి సెటిల్మెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాయకులు గజ్జల రాజు గౌడ్, బొమ్మిడి కిరణ్ రెడ్డి, గౌని వెంకటేశ్ గౌడ్, కాటన్ శేఖర్ గౌడ్, పాశం జీవన్ రెడ్డి , కంది శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్, వెంకటాచారి, మల్లేశ్ యాదవ్, చిలుక గణేశ్, పందుల రాజు గౌడ్, బాలరాజు, శశిధర్ రెడ్డి, చిలుకూరి రాజేందర్, ప్రభాకర్ రెడ్డి, తడకమళ్ళ విజయ్ కుమార్, విజయ్ శ్రీ , ప్రవీణ్ కుమార్, రాజు ముదిరాజ్, అంజి ముదిరాజ్, నేపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సుధీర్, అరవింద్ పాల్గొన్నారు.