calender_icon.png 19 August, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసమ్మ కుంట అలుగు ఆక్రమణ

18-08-2025 10:41:31 PM

నిద్రమత్తులో అధికారం యంత్రాంగం..?

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుల డిమాండ్

మేడ్చల్ అర్బన్: చెరువులు, కుంటలను పరిరక్షించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎల్లంపేట పురపాలక పరిధిలోని నాళాలు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని మున్సిపాలిటీ ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుంటలు, చెరువులు, నాళాలు కబ్జాలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ, హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలను నేలమట్టం చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న మేడ్చల్ మండల రెవెన్యూ పరిధిలో అధికారులు చొరవ తీసుకొని చెరువుల కబ్జాలను వెలికి తీస్తే పద్దుల సంఖ్యలో చెరువు,నాళాల కబ్జాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు కోరారు. లేనిపక్షంలో ఈ విషయమై హైడ్రాక్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ప్రైవేట్ వెంచర్ వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుల డిమాండ్

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో ఓ వెంచర్ మైసమ్మ కుంట అలుగును అక్కడ ఆక్రమించిందని ఎల్లంపేట మున్సిపాలిటీ బీజేపీ నాయకులు ఆరోపించారు. సదరు వెంచర్ ఆక్రమణలతో ఇటీవల కురిసిన వర్షాలకు తమ పంట పొలాల్లోకి వరదనీరు చేరి పంట కొట్టుకుపోతుందని రావల్కోల్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 575 పి, 576 పిలొ ఓ ప్రైవేట్ వెంచర్ నిర్మాణం చేస్తూ, మైసమ్మ కుంటకు సంబంధించిన అలుగును కబ్జా చేయడం వల్లే రైతులు పెట్టుబడులు పెట్టి పంట నష్టపోతున్నారని ఎల్లంపేట మున్సిపాలిటీ బిజెపి నాయకులు అంటున్నారు.

అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చుట్టుముట్టు ప్రహరీ నిర్మాణం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లే అలుగు కబ్జా అయినట్లుగా పలు విమర్శలు ఉన్నయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ల నిర్మాణం కొనసాగుతున్నా, హెచ్ఎండిఏ, మునిసిపల్, ఇరిగేషన్ శాఖల అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని మున్సిపల్ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.