18-08-2025 11:46:41 PM
సనత్నగర్,(విజయక్రాంతి): బల్కంపేట్లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్థానిక ప్రజలు, గౌడ్ సంఘం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలను అయిలా మధు గౌడ్ (DCC జనరల్ సెక్రటరీ) ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాంప్రదాయ వాయిద్యాలు, జైజై కారాలతో ప్రాంతమంతా ఉత్సవ వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో ప్రసంగించిన అయిలా మధు గౌడ్ (DCC జనరల్ సెక్రటరీ) మాట్లాడుతూ... “సర్దార్ సర్వాయి పాపన్న సాధారణ కూలీ కుటుంబంలో పుట్టినా తన ధైర్యం, త్యాగం, పట్టుదలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నిజాం రాజుల అణచివేతకు వ్యతిరేకంగా కత్తి ఎత్తి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. ఆయన పాలనలో సమానత్వం, న్యాయం ప్రతిబింబించాయి. నేటి తరాలు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు.కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భోజనం స్వీకరించారు.