03-01-2025 12:00:00 AM
చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారడం, పొట్టురాలడం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని తగ్గించుకోవడానికి మాయిశ్చరైజర్ రాస్తే మాత్రమే సరిపోదు. సబ్బులు, బాడీ వాష్ల వాడకమూ తగ్గించాలి. బదులుగా మన పూర్వికులు వాడే నలుగు పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా నలుగును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
మూడు చెంచాల శనగపిండికి చెంచా పెసరపిండి, కాస్త చందనం పొడి, పావు కప్పు పాలు కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా ఒంటికి నువ్వుల నూనె రాసి ఆపై ఈ మిశ్రమంతో నలుగు పెడితే సరి. ఇది చర్మానికి తేమనందించడమే కాదు.. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యనీ తగ్గిస్తుంది.
రెండు చెంచాల చందనం, చెంచా బాదం పొడి ఒక చెంచా తేనె, చెంచా పాలు కలిపి.. ముఖానికి రాయాలి. ఆపై మృదువుగా కనీసం పది నిమిషాలైనా మర్దన చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసి మాయిశ్చరైజర్ రాయలి. ఇలా చేస్తే చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
పావు కప్పు పాలల్లో మూడు చెంచాల పెసరపిండి, చెంచా శనగపిండి, కొద్దిగా గులాబీ ఆకుల పొడి, చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలిపి.. నలుగు పెట్టాలి. ఇది చర్మం తాజాగా ఉండేలా చేయడమే కాదు.. మురికి, మృతకణాలను తొలగిస్తుంది. నల్లమచ్చలు, ముడతలు వంటివాటిని తొలగించడంలో సహాయపడుతుంది.