26-07-2025 10:27:44 PM
కీతవారిగూడెంలో దుర్వాసనతో కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయిన గ్రామస్తులు..
గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక రకమైన దుర్వాసన వ్యాపించడంతో కొద్దిసేపు గ్రామస్తులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్రామ సమీపంలో గల కంకర మిల్లులో పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయని, సమీపంలోని కంకర మిల్లులో బ్లాస్టింగ్లు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ భారీ శబ్దాలతో గ్రామంలోని అందరి ఇళ్లల్లో సామాగ్రి కింద పడిందని కొద్దిసేపు భయాందోళనలకు గురికావాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం కొద్దిసేపటికి గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన వాసన లాంటిది కొద్ది క్షణాల్లోనే గ్రామం అంతా పాకిందని ఆ సమయంలో వృద్ధులు, చిన్నారులు కొద్దిసేపు ఊపిరి పీల్చుకోవటం కష్టమైందన్నారు. అంతేకాకుండా కళ్ళు మంటలు వచ్చాయని ఒక రకమైన పొగలాంటిది గ్రామమంతా వ్యాపించిందన్నారు. తదుపరి దుర్వాసన కొంత తగ్గిందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే గరిడేపల్లి ఎస్ఐ సీహెచ్.నరేష్ స్పందించి కీతావారిగూడెం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు.