16-06-2025 01:47:00 AM
హైదరాబాద్, జూన్ 15: జర్మనీ నుంచి హైదరాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యలో నుంచే వెనక్కి మళ్లించారు. లుఫ్తాన్సా ఎల్ 752 విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్ విమానాశ్రయం నుంచి బయలుదేరగా బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని మళ్లీ ఫ్రాంక్ఫర్డ్కే తరలించారు.
శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఈ బాంబు బెదిరింపు వార్తను ధృవీకరించారు. ఈ విమానంలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో పక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే ఓ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూడు గంటలకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాశారు.