09-07-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, జూలై 8 ః కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఏడవ వార్డులో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బురుజు మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం భవనం వద్ద సంఘ నాయకులు గౌరవపూర్వకంగా ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సంఘ ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
పండుగలో భాగంగా మహిళలు సాంప్రదాయ హంగులతో బోనాలను సిద్ధం చేసి, ఉపవాస దీక్షతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.రంగురంగుల పుష్పాలతో అలంకరించిన మైసమ్మ అమ్మవారి ప్రతిమ ముందు, డప్పుల చప్పులు, డీజే సంగీతం, సాంప్రదాయ నృత్యాలతో వాతావరణం ఉత్సవరంగులలో మునిగిపోయింది.
యువత, మహిళ లు, పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సాంఘిక ఐక్యతను చాటిచెప్పారు. ఈ వేడుక ముదిరాజ్ సంఘ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు, స్థానికులకు ఆధ్యాత్మికానందాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు బట్టు విట్ఠల్, ఎల్లారెడ్డి సంఘం అధ్యక్షుడు కోర్న నారాయణ, మాజీ పురపాలక ఛైర్మన్ కుడుముల సత్య నారాయణ, సంఘ నాయకు లు ప్యాలాల రాములు, కిష్టయ్య, సాయిలు, నర్సింహులు, సత్యం, భూమయ్య, పోచయ్య, లక్ష్మణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.