28-07-2025 11:17:14 AM
తుంగతుర్తి(విజయక్రాంతి): గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు, రైతుల కష్టాలు త్వరలో తీరని ఉన్నాయనే చెప్పాలి. వానకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాల ప్రజలు వాగు దాటాలంటేనే భయపడేవారు. నెలలపాటు వాగుపై రైతన్నలు, నూతన రోడ్డు లేక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించేవారు. ఈ వాగులో పడి కొంతమంది మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం, కోడూరు గ్రామాల మధ్య బంధం వాగు ఉంది. వర్షాకాలంలో రుద్రమ చెరువు నుండి ఉద్రిక్తంగా ప్రవహించే వరదతో, పరిసర గ్రామాల ప్రజలు సంగెం మీదుగా ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు, వ్యవసాయదారులు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడేవారు.
ఈ వాగుపై వర్షాకాలంలో ప్రాణాలు పోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ప్రచార సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గా పర్యటించిన మందుల సామెల్ నేను గెలిచిన వెంటనే తిమ్మాపురం నుండి కోడూరు, కొమ్మాలా, సంగెం వెంకేపల్లి చిల్పకుంట్ల నూతనకల్ వరకు డబల్ రోడ్డు వేయించడమే కాకుండా ,సంగెం గ్రామంలోని బంధం వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో తిరిగి, ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన మందుల సామేలు, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిని సంబంధిత మంత్రులను కలిసి ఈ ప్రాంత ప్రజల కష్టాలను విన్నవించగా దీంతో స్పందించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి దృష్టికి, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించగా రూ.12 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా వెంటనే పనులు సైతం ప్రారంభించి రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల ఎమ్మెల్యే సామెల్ కృషితో బ్రిడ్జి నిర్మాణం పనులు చురుగ్గా సాగడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.