14 August, 2026 | 1:33 AM

మున్సిపల్ ఆస్తి ధ్వంసంపై స్పందించిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు

14-08-2026 12:00 AM

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు

నాగర్ కర్నూల్ ఆగస్టు 13 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రహత్నగర్ కాలనీ నక్కలవాగు వద్ద మున్సిపాలిటీకి చెందిన పాత ఇన్ లెట్ వెల్ బావిని అనుమతులు లేకుండా జేసీబీతో కూల్చివేసిన అంశంలో ఈనెల 10న వివాదాస్పద స్థలంలో కూల్చివేతలు అనే వార్త కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది. దీనిపై స్పందించిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 9న జరిగిన కూల్చివేతతో రూ.20 లక్షలకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైందన్నారు. వర్షపు నీరు కేసరి సముద్రం చెరువులోకి వెళ్లే మార్గం మూసుకుపోయి కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కూల్చివేతలు జరపడం వల్ల ప్రాణహాని ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బాధ్యులతో పాటు జేసీబీ యజమానిపై చర్యలు తీసుకుని స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని రక్షణ గోడ నిర్మించాలని కోరారు.