10-10-2025 12:00:00 AM
మేడ్చల్ , అక్టోబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా మేడ్చల్ బస్ డిపో ముందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు మేడ్చల్ మార్కెట్ నుండి ర్యాలీగా వస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని షాపులలో, ప్రజలకు కర పత్రాలను పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు జోక్యం చేసుకొని బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చిందన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, బిఆర్ టి యు జిల్లా అధ్యక్షులు సంబు ప్రభాకర్, మాజీ వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్, మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి, పార్టీ నాయకులు మెట్టు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రాజు, సుదర్శన్, విష్ణు చారి తదితరులు పాల్గొన్నారు.