10-10-2025 06:51:08 PM
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ
హుజూర్ నగర్: విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సమస్యలను పరిష్కారం చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా విద్యా రంగంలో పురోగతి లేదన్నారు. పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు.
గత ఆరు సంవత్సరాలనుండి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు 8600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.స్కాలర్షిప్స్ రాకపోవడం విద్యార్థులు కళాశాలలకు ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని, వేల రూపాయలు కళాశాలకు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వారు పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 200 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండటంతో మేము పాఠశాలల ను నడపలేమని యాజమాన్యాలు చేతులు ఎత్తేయడం విద్యార్థులు పాఠశాలకు దూరమవుతున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు పక్కా భవనాలు లేక అద్దె భవనాలలో విద్యార్థులు కాలం వెళ్ళదీస్తున్నారని, ఒకవైపు ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యారంగం సంక్షోభంలో ఉంటే పట్టించుకోని ప్రభుత్వం యదేచ్చగా కార్పొరేట్ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ రూ.కోట్ల దోపిడీకి తెరదీస్తున్నారు. చిత్తశుద్ధితో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్షంలో విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా చెవగాని ప్రదీప్ గౌడ్,నందిపాటి లోహిత్, ఆఫీస్ బేరర్స్ గా పవన్, సాకేత్, నవనీత్, జగన్ సింగ్, షరీఫ్, రాకేష్ లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.