31-08-2025 12:33:25 PM
హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్ట సవరణపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాట్లాడారు. ఈ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర అఖిలపక్షానికి సమయం తీసుకోండని, తాము కూడా వచ్చి బలంగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూ తెలంగాణ సాధించుకుని వస్తా అని చెప్పి పోయారు.. దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరి ఢిల్లీకి పోయి బీసీ బిల్లు సాధించేదాకా అవసరమైతే జంతర్ మంతర్లోనే కూర్చోవాలని ధ్వజమెత్తారు. అంత కమిట్మెంట్, నిబద్ధత ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉండాలని.. బిల్లు సాధించాలంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ లో అమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. అపాయింట్మెంట్ లు అడిగితే ఢిల్లీలో చెప్పులు ఏత్తుకుని పోతారని చెప్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అపాయింట్మెంట్ లు ఎందుకు ఇస్తారు..? ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి, మాట తీరు మార్చుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్లు తెలంగాణలో ఆమోదం పొందకముందే.. తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్ లో ముఖ్యమంత్రి తన ఫోటోలతో పత్రిక ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఓబీసీ వెల్ఫేర్ శాఖ పెట్టాలని డిమాండ్ చేసిన నాయకుడు కేసీఆర్ అని, 2004లోనే కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు.
2002లోనే బీసీ పాలసీని పార్టీ తరఫున తీసుకొచ్చిన నాయకుడని.. రాహుల్ గాంధీ కంటే ముందే కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. జనగణనతో పాటు కులగణన కోసం డిమాండ్ చేశారని.. శాసనసభలో ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా, దీనిపై మన పరిధిలో లేదని అన్నారు. కానీ ఈ అంశం ముఖ్యమంత్రికి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు తెలియదనుకోవడం లేదని, 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని.. అందుకే తమ పరిధిలో లేని అంశంపై చట్టం తీసుకువచ్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని.. మరి ఎందుకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని ఆయన పార్లమెంట్లో మాట్లాడడం లేదు..? అని మండిపడ్డారు. మార్చిలో బిల్లు పాస్ చేసిందానికి, దీనికి తేడా ఏమిటో ఇప్పుడు చెప్పండని.. అప్పుడు చేసిన దానికి, ఇప్పుడు చేసిందానికి తేడా ఏమిటి..? అప్పుడు చేయని రాష్ట్రపతి, గవర్నర్ ఇప్పుడు ఎలా చేస్తారు..? అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు లొసుగులు లేకుండా చేసుకుంటే మంచిదని.. కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదు, డెడికేషన్ ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, గతంలో మేం పెట్టిన పంచాయతీరాజ్ చట్టంలో, మున్సిపల్ చట్టంలో ఎక్కడా సీలింగ్ అనే అంశం లేదు అని తెలిపారు.