calender_icon.png 3 June, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతతపై పేలిన తూటాలు!

25-04-2025 12:00:00 AM

ఐ.వి.మరళీ కృష్ణశర్మ :

సుదీర్ఘకాలం ఉగ్రవాదంతో అల్లకల్లోలమై ఇప్పుడిప్పుడే ప్రశాం తత నెలకొంటున్న వేళ ఆహ్లాదకరమైన పచ్చని కశ్మీర్ మళ్లీ రక్తసిక్తమైంది. పచ్చికబయళ్లతో కప్పిన పర్వతాలు, లోయలు, మైదానాలతో రమణీయ ప్రకృతితో పర్యాటకులను ఆకట్టుకోవడంలో కశ్మీర్ ముందు వరుసలో ఉంటుంది. దశాబ్దాలుగా నిత్యం ఉద్రిక్తతలు నెలకొన్న కశ్మీర్లో పర్యటించాలం టే సగటు భారతీయులు ధైర్యం చేసేవారు కారు.

కొన్నాళ్లుగా పరిస్థితుల్లో మార్పు రావడంతో అక్కడి అందాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆరు నెలల క్రితం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా జరగడంతో అంతా బాగుందనే వాతావరణం నెలకొంది. దీంతో జమ్మూ కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌పై కుళ్లుకున్న పాకిస్తాన్ కశ్మీర్‌పై కుట్రలకు తెరలేపుతూ ఉగ్రవాదులను ఉసిగొల్పింది.

మినీ స్విట్జర్లాండ్‌గా ప్రఖ్యాతిగాంచిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో బైసరస్ లోయలోని పచ్చని ప్రకృతి మైదా నం పర్యాటకులతో కిటకిటలాడుతున్న వేళ ముష్కరులు అత్యంత హేయంగా కాల్పులు జరపడంతో ఇద్దరు విదేశీయులుసహా 28 మంది మృతి చెందారు. పర్యాటకులను అతి కిరాతకంగా చంపి భారత ప్రభుత్వానికి సవాలు విసరడంతోపాటు భారతీయుల్లో భయభ్రాంతులను సృష్టించడమే లక్ష్యంగా వీరు కాల్పులు జరిపారు.

మహిళలను బెదిరిస్తూ పురుషులను టార్గెట్ చేసుకొని క్రూరంగా ప్రాణలు తీశారు. ఇంకా దురదృష్టకరమైన అంశం పర్యాటకుల గుర్తింపు కార్డులను పరిశీలించి పేర్ల ఆధారంగా మత విభజన చేసి చంపారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమం వెనుక కుట్రల్లో రహస్యాలేమీ లేవు.

దేశ విభజన కాలం నుండి కశ్మీర్‌పై కన్నేసి కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న శాంతియుత వాతావరణం కంటగింపుగా మారింది. పర్యాటకులను చంపి భయానక వాతావరణం సృష్టించడంతోపాటు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. రాబోయే జులై నెలలో హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుండడంతో భక్తులను హెచ్చరిస్తూ ఈ దాడులు చేశారనేది బహిరంగ రహస్యమే.

స్థానికుల సాయం ఎందుకంటే?

భారతదేశం చేతిలో పలుమార్లు భంగపాటుకు గురైనా బుద్ధి తెచ్చుకోని పాకిస్థాన్ కశ్మీర్‌లోని స్థానికుల సాయంతో ఈ కిరాతక దాడి చేసింది. ఉగ్రవాదుల దాడుల్లో తమ హస్తం లేదని నిరూపించుకునేందుకు స్థానికులను ఇందులో భాగం చేసినా పాకిస్థాన్ కుట్రలు బయటపడ్డాయి. పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థ లష్కరే ‘తోయిబా’కు అనుబంధంగా ఉన్న స్థానిక ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఈ దాడిలో కశ్మీరీలతోపాటు పాకిస్థాన్ ఉగ్రవాదులూ ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ చేసిన వాఖ్యలూ ఈ కుట్రలో భాగమే. “కశ్మీర్ మనకు జీవనాడి.. కశ్మీర్ సోదరులను ఒంటరిగా వదిలేయ లేం.. కశ్మీర్‌లోని పిల్లలకు పాకిస్థాన్ గురించి చెప్పండి.. భిన్నమైన హిందు ముస్లిం మతాలు, సంప్రదాయాలే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది...” అని ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పహల్గాం లో ఘాతుకం జరిగింది.

ఆయన కోరుకున్నట్టే మతపరంగా అమాయకులను పొట్టన బెట్టుకున్నారు. ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి “మీ మోదీకి చెప్పండి, ఈ దాడి గురించి..” అంటూ భర్తను పోగొట్టుకున్న ఒక యువతితో అనడం వారి పైశాచకత్వానికి నిదర్శనం. పవిత్ర ఇస్లాం వాక్యమైన ‘కలిమా పఠించమని, లేకపోతే చంపేస్తామని’ బెదిరించి కొందరి ప్రాణాలు తీశారు.

అమానవీయమైన పహల్గాం ఘటనతో “మాకేమీ సంబంధం లేదంటూ, భారతదేశంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు జరు గుతున్నాయని, వాటిని పక్కదారి పట్టించేందుకు ఈ దాడిని మావైపు నెటుతున్నారు..” అంటూ పాకిస్థాన్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది.

దాడి చేసిన ఉగ్రవాదులు ఈ క్రూరత్వాన్ని తమకు పని అప్పగించిన వారికి తెలియజేయాలనే ఉత్సహంతో ముసుగులు ధరించిన వీరు తమ తలలపై పెట్టుకున్న హెల్మెట్లకు కెమెరాలు అమర్చుకొని ఘటనను రికార్డు చేశారు. పాకిస్థాన్ ఎంత కాదన్నా ఉగ్రవాదులు దాడి చేసిన తీరు, పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ కుట్రలను బహిర్గతం చేస్తున్నాయి.

పాకిస్థాన్ హస్తం బహిరంగ రహస్యం

కశ్మీర్ దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని చెప్పడానికి పెద్దగా విచారణలు, పరిశోధనలు అవసరం లేదు. ప్రతిసారీ ఇది సర్వసాధారణమే. అయితే, ఇక్కడ మన భద్రతా వైఫల్యంపై కూడా చర్చించాలి. భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఆగంతకులు కాల్పులు జరిపారు. పర్యాటకులపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతున్నారని కొన్ని రోజుల క్రితం నిఘా వర్గాలు హెచ్చరించినా భద్రతా దళాలు కుట్రలను ఛేదించడంలో విఫలమయ్యాయనే వార్తలున్నాయి.

ఆర్టికల్ 370 తర్వాత రాష్ట్రపతి పాలన సమయంలో ప్రధానంగా జమ్ములోనూ హిందువులే లక్ష్యంగా దాడులు జరిగినా కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగి పోయింది. ఇప్పుడు మళ్లీ అవే ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరం. ఈ దాడుల ఘటనలో కొన్ని స్థానిక హోటళ్లు ఉగ్రవాదులకు సహకరించాయనే అనుమానాలూ ఉన్నాయి. పహల్గాం ఉగ్రవాదుల దాడి అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఘటనతో ఉగ్రవాదానికి, మతానికి మధ్య చర్చలతో పెద్ద దుమారమే రేగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, వాటిని మతం కోణంలో చూడలేమనే వాదనలున్నాయి. అయితే, పహల్గాం ఘటనలో పేర్లనిబట్టి ఉగ్రవాదులు అమాయకులను చంపడంతో ఇక్కడ మతపరంగానే దాడులు జరిగాయనేది స్పష్టం.

అయితే, ఇదే సందర్భంలో గుర్రపు స్వారీని వృత్తిగా చేసుకున్న ఒక స్థానిక ముస్లిం యువకుడు సాహసంగా కాల్పులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆయననీ ఉగ్రవాదులు చంపేశారు. ఉగ్రవాదులకు మతపిచ్చి ఉన్నా సాధారణ ప్రజల కు ఆ జాఢ్యం ఉండదని ఈ ఘటన నిరూపిస్తుంది.

అంతేకాక, కాల్పుల్లో గాయపడ్డ వారిని స్థానికులే ఎలాంటి మతద్వేషాలు లేకుండా హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి కొందరి ప్రాణాలు రక్షించారు. ఎక్కడైనా ఉగ్రవాదుల దాడులను కిరాతక చర్యలుగానే భావించాలి కానీ, దానికి మతం రంగు పులిమితే దేశంలో లేనిపోని ఉద్రిక్తతలను సృష్టించడమే. గతంలో రాజకీయ అవసరాల కోసం పాకిస్థాన్ పాట పాడిన పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ ఒక కశ్మీరీగా పహల్గాం దాడికి సిగ్గుపడుతున్నామని చెప్పడం గమనార్హం.

దేశమంతా ఒక్కమాటపైనే!

పహల్గాం ఉగ్రదాడి వెనుక దాయాది పాకిస్థాన్ హస్తం ఉందని తేటతెల్లమైన దశ లో ఆ దేశానికి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడంతోపాటు దేశ సరిహద్దులో నిత్యం ఉద్రిక్తత లను ప్రేరిపిస్తున్న పాకిస్తాన్‌ను మళ్లీ మన దేశం వైపు కన్నెత్తకుండా దెబ్బతీయాలి. 

జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని చూడలేని పాకిస్థాన్ ఉగ్రదాడిని ప్రేరేపించడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దేశానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. సిం ధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపేయడంతోపాటు అటారీ సరిహద్దు మూసి వేయాలన్నారు. పాక్ జాతీయులను భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించడంతోపాటు పాక్ జాతీయులకు వీసాల జారీని ఆపేశా రు.

ఇరు దేశాల హైకమిషన్లలో సిబ్బందిని తగ్గించారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేశా రు. వీటిలో కీలకమైంది సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేయడమే. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 1960లో  పాకిస్తాన్‌తో సింధూ జలాలపై చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

భారత్, పాక్ మధ్య 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం కొనసాగింది.  భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపేయాలని నిర్ణయించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మతం పేరుతో ఉగ్రవాదులు కిరాతంగా కాల్పులు జరిపినా భారతీయులు దీన్ని భారత్‌పై జరిగిన కుట్రగానే పరిగణిస్తున్నారు.