25-04-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడే సాధించే విజయాలు కూడా అంత గొప్పగానే ఉంటాయి. కార్య సాధకులు ఎప్పుడూ లక్ష్యమార్గంలో ఎదురయ్యే ఆటంకాల గురిం చి కాకుండా లక్ష్యసాధనపైనే గురిపెడతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా దేశీయ- అంతర్జాతీయ వేదికలపై తరచూ చెబుతున్న మాట తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని, హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో నగరాలలాగా ప్రపంచంలోనే ఒక అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలని.
తాను కలలు కంటున్న లక్ష్యం మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే హైదరాబాద్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దటం తద్వారా నగరాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చటం. ఢిల్లీ శాసన రాజధానిగా, ముంబై ఆర్థిక రాజధానిగా, బెంగళూరు సాంకేతిక రాజధానిగా ఎలా ఎదిగాయో అదే వరుసలో హైదరాబాద్ కూడా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్సీ) రాజధానిగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షగా కనిపిస్తున్నది.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల పరిణామ క్రమాల లో పెట్టుబడుల సాధన, పారిశ్రామికవేత్తల ఆకర్షణ కోసం కొత్తగా ప్రభుత్వం ఫోర్త్ సిటీని (నెట్ జీరో సిటీ) ఇన్వెస్టర్స్ ముందు పెడుతున్నది. ఫోర్త్ సిటీ నిర్మాణం, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, డ్రై పోర్ట్ నిర్మాణాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యభాగాన్ని తయారీ కేంద్రంగా (మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్) మార్చి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది.
దావోస్తో మొదలుపెట్టి ..
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభు త్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత దావోస్లో ప్రతి ఏటా జరిగే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సదస్సులో పెట్టుబడుల సాధన కోసం రెండు పర్యాయాలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతినిధి బృందం ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో 54వ ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో పాల్గొని వివిధ కంపెనీలతో దరిదాపు 40,252 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలను చేసుకున్నారు. అదే ఒరవడితో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో 55వ ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సదస్సులో పాల్గొని దాదాపు 1.78 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడం ద్వారా భారీ పెట్టుబడులను తీసుకురాగలి గారనే చెప్పాలి.
రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు అమెరికా, దక్షిణ కొరియా, సింగ పూర్లతో పాటు జపాన్లో పర్యటించారు. అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించి వివిధ పారిశ్రామిక పెట్టుబడి సంస్థలతో 31,532 కోట్ల రూపాయల ఒప్పందాలను, సింగపూర్ పర్యటనలో భాగంగా 3,500 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలను చేసుకున్నారు. రెండు పర్యాయాల దావోస్ పెట్టుబడులతోపాటు అమెరికా దక్షిణకొరియా, సింగపూర్ దేశాల పర్యటనలతో దాదాపు 2,53,284 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలను వివిధ కంపెనీలతో చేసుకోగలిగారు.
ఇమేజ్ పెంచిన జపాన్ పర్యటన
పెట్టుబడుల సాధనకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు ఏడు రోజులు రేవంత్రెడ్డి ప్రతినిధి బృందం జపాన్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం ప్రతినిధి బృందం సుమారు 30,500 ఉద్యోగ అవకాశాలు కల్పించే 12,062 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో గతం లో ఎన్నడూ జపాన్ నుంచి ఒక రాష్ట్రం ఈ స్థాయిలో పెట్టుబడులు రాబట్టక పోవటంతో ఒక రకంగా ప్రభుత్వ ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి.
65 దేశాలలో వ్యాపారాలు కలిగిన జపాన్కు చెందిన మారుబెని కంపెనీతో ఫ్యూచర్ సిటీలో 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో 6 వేల ఎకరాలలో నెక్ట్స్ జనరేషన్ పార్కు ఏర్పాటుకి ఒప్పందంతో భవిష్యత్తులో ఐదువేల కోట్ల రూపా యల పెట్టుబడి విస్తరణతోపాటు సుమారు 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే నేయీసా నెట్వర్క్ సంస్థతో 10,500 కోట్ల రూపాయలతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు, రుద్రారంలో 562 కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమకు చెందిన ఒప్పందాలు జపాన్ పర్యటనలో కీలకమైనవిగా భావించాలి. జపాన్లో తెలంగా ణ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం టామ్కామ్ టేర్నా రాజ్ గ్రూపు మ ధ్య కుదిరిన ఒప్పందం కూడా కీలకమైంది.
టోక్యో- ఇండో ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో 150 మంది జపాన్ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశం, ఒసాక వరల్డ్ ఎక్స్పోలో రేవంత్రెడ్డి కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దామనే పిలుపు భవిష్యత్తులో జపాన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం చేస్తుందనే చెప్పాలి.
తెలంగాణలో పెట్టుబడుల సాధన కోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సీఎం సిద్ధంగా లేరని చెప్పటా నికి పై ఎక్స్పో సదస్సు ఉదాహరణ. భారతదేశం నుంచి ఒసాకా వరల్డ్ ఎక్స్పో సదస్సు లో పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణనే.
పెట్టుబడుల సాధనతోపాటు పర్యావరణ హిత నగరాలుగా అత్యంత కాలుష్యమైన కిటా కుషూ, హిరోషిమా నగరాలు ఎదిగిన తీరుని అధ్యయనం చేయటం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రతిపాదిత ఫోర్త్ సిటీ (నెట్ జీరో సిటీ)లను కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పం తెలంగాణ రైజింగ్ బృందం వారిలో కనపడుతున్నది.
ఎకో టౌన్ ఏర్పాటుకు కిటాకిషూ, హైదరాబాద్ నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందానికి ఉన్న అవకాశాల పరిశీలన కూడా భవిష్యత్తులో సున్నా స్థాయి కర్బన్ ఉద్గారాల నగర నిర్మాణానికి దోహదపడుతుంది. సువిధ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన, మురాసకి నది ప్రక్షాళన జరిగిన తీరును పరిశీలించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అనుభవం భవిష్యత్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనకి దోహదపడుతుంది.
కలిసి వచ్చే అంశాలు
ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు, టెక్స్ టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, సెమీ కండక్టర్లు, ఎనర్జీ స్టోరేజ్, ఏరోస్పేస్ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూల వాతావర ణాన్ని జపాన్ పారిశ్రామిక వేత్తలకు వివరించడం ద్వారా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం వైపుకి మళ్ళించటానికి రేవంత్రెడ్డి బృందం చూపిన చొరవ ప్రశంసనీయం.
స్థిరమైన, సులభమైన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రపంచస్థాయి అవస్థాపనా సౌకర్యాలు, ప్రతిభావంతమైన నిపుణు లు అందుబాటులో ఉండటం వంటివాటివల్ల తెలంగాణ పెట్టుబడుల సాధనలో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడటమేకాక తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది.
లక్షన్నర ఎకరాల తో సమృద్ధి ల్యాండ్ బ్యాంకు ఉండటం తెలంగాణకు కలిసివచ్చే అంశం. అలాగే ప్రభుత్వ ఆలోచన మేరకు బందర్ పోర్టుతో అనుసంధానం జరిగే విధంగా డ్రై పోర్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఎగుమతి దిగుమతులకు మరింత ప్రోత్సాహం దొరుకుతుంది.
సీఎం రేవంత్రెడ్డి ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ తన బ్రాండ్గా చెప్తున్నారు. తెలం గాణ ఉద్యమ ఆకాంక్ష అయినా ఉద్యోగాల కల్పన లక్ష్యం నెరవేరాలంటే ఒకవైపు నిరంతరాయంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు మరొక వైపు పెట్టుబడుల ఆకర్షణద్వారా పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి. అప్పుడే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చినట్లుగా భావించాలి.
వ్యాసకర్త సెల్: 9885465877