17-08-2025 12:32:48 AM
- 20 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసుల స్వాధీనం
- ఒడిశా నుంచి మహారాష్ర్టలోని నాగ్పూర్కు తరలింపు
అబ్దుల్లాపూర్మెట్, ఆగస్టు 16: కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో కారులో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం ప్రాంతంలో శనివారం కారు డివైడర్ను ఢీకొట్టిం ది. సమాచారం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిన్నట్లు గుర్తించారు.
కారును పూర్తిస్థాయిలో పరిశీలించగా అందులో మద్యం బాటిల్స్, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా కారు డ్రైవర్ది మహబూబాబాద్ జిల్లా పుల్లూరు మండలం, బీఆర్ఎం తండాకు చెందిన భూక్య మధు గుర్తించారు. మధుకు ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్ సర్కిల్కు చెందిన సాదిబ్ అనే స్నేహితుడు ఉన్నాడు. సాదిబ్ సూచన మేరకు గంజాయి తరలించే ఒప్పందానికి మధు ఒప్పుకున్నాడు.
సాదిబ్ రూ.50వేలు ఇచ్చి ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రాజమండ్రిలోని గోకవరంకు వెళ్లి అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి మరో రూ.45వేలు ఇచ్చి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. మధు దారి ఖర్చుల కోసం రూ.5 వేలు తన దగ్గరనే ఉంచుకున్నాడు. ఈ నెల 14న రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా ఖానాపురం వచ్చి 15న హైదరాబాద్ మీదుగా మహారాష్ర్టలోని నాగ్పూర్కు వెళ్లే క్రమంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద డివైడర్ను ఢీకొట్టాడు.
దీంతో కారులో గంజాయి బయట పడింది. రాజమండ్రిలో గంజాయి అప్పజెప్పిన గుర్తు తెలియని ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన సాదిబ్, కారుడ్రైవర్ మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ వి అశోక్రెడ్డి తెలిపారు.