ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ పిలుపు
కొత్తపల్లి, మే 12(విజయ క్రాంతి): ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆవులను వధించ కూడదని, ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించ కూడదని మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ రిలీజియస్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రేకుర్తి మదర్సా అరబియా హిఫ్జుల్ ఖురాన్ ప్రిన్సిపాల్ ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ యావత్తు ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.
మంగళవారం నగరంలోని రేకుర్తి షేక్ ఖాన్ నగర్ మస్జిద్ లో మజ్లీస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ రిలీజియస్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత ముస్లింలు, ఇమామ్, మస్జిద్ అధ్యక్షుల అవగాహన సదస్సులో ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ త్వరలో పవిత్ర బక్రీద్ మాసం రాబోవుతుందని, బక్రీద్ మాసంలో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులను వధించకూడదని, ఇది చట్టరీత్యా నేరమన్నారు.
ఇస్లాం ధర్మం ప్రకారం మనం చేసే పనులు, కార్యక్రమాలతో సమాజంలో నివసించే ఇతర ధర్మం ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఆవిధంగా జీవించాలని మహానీయ మహమ్మద్ ప్రవక్త సెలవి చ్చారని పేర్కొన్నారు. బక్రీద్ లో పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ హిప్జి, కలీమ్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.






