04-08-2025 11:40:12 PM
రెస్క్యూ చేసి కాపాడిన పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది..
వలిగొండ (విజయక్రాంతి): మండలంలోని పొద్దుటూరు గ్రామం గుండా ప్రవహించే మూసి వాగులో సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన నలుగురు పశువుల కాపరులు మూసి ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో వాగు ఉధృతి ఎక్కువ కావడంతో వాగులో చిక్కుకుపోయారు. అయితే వాగులో చిక్కుకున్న పెద్దబోయిన బుచ్చయ్య, గజ్జి శ్రీను, పల్సం తరుణ్, పల్సం ప్రశాంత్ వాగు నుండి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ వాగు ఉధృతి అంతకంతకు పెరగడంతో సెల్ ఫోన్ ద్వారా తమ వారికి సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన చేరుకుని పరిస్థితిని గమనించి స్థానిక పోలీసులకు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీస్, రెవిన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాళ్ల సహాయంతో దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి పశువుల కాపరులను రెస్క్యూ చేసి కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో డిసిపి ఆకాంక్ష యాదవ్, ఏసీపి మధుసూదన్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ దశరథ, ఎస్ ఐ యుగంధర్ గౌడ్, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.