10-09-2025 06:07:25 PM
పట్టణ ఎస్సై రాజశేఖర్
మందమర్రి (విజయక్రాంతి): సమాజంలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు వారి వారి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్(SI Rajasekhar) కోరారు. పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రజల భాగస్వామ్యంతో 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కుని నేర రహిత సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుతో కాలానికి భద్రత కవచం ఏర్పడుతుందన్నారు. కాలనీలోని ప్రధాన రహదారులు, కూడళ్లపై నిరంతర నిఘా ఉంటుందని, అనుమానిత వ్యక్తుల కదలికలను పసిగట్టి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం సాధ్య మవుతుందని,దొంగతనాలను నియంత్రించడం, నేరస్తులను వేగంగా గుర్తించి పట్టుకోవడం సులభమవుతుందన్నారు. అంతే కాకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు, రికార్డయిన సీసీ ఫుటేజ్ ద్వారా బలమైన సాక్ష్యాధారాలుగా పరిగణించడం జరుగుతుంద న్నారు. పట్టణ ప్రజలు పోలీసులతో సహకరించి ప్రతి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.