calender_icon.png 4 September, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన చందానగర్ పోలీసులు

01-09-2025 06:35:41 PM

ఆరుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు 

ఐదుగురు నిందితుల అరెస్ట్

వివరాలు వెల్లడించిన డీసీపీ వినీత్

గచ్చిబౌలి,(విజయక్రాంతి): చందానగర్ పోలీసులు బాలల కిడ్నాప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి, ఆరుగురు చిన్నారులను రక్షించారు. లింగంపల్లి పొచమ్మగుడి సమీపంలో నాలుగేళ్ల అఖిల్ అదృశ్యమైన కేసు దర్యాప్తులో ఈ గ్యాంగ్ బట్టబయలైంది. ప్రధాన నిందితుడు పటాన్‌చేరు వాసి చిలుకూరి రాజు గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, ఒంటరి ప్రదేశాల్లో ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాజు రెక్కీ చేసి పిల్లలను కిడ్నాప్ చేయగా, అతడి సహచరులు మొహమ్మద్ ఆసిఫ్, రిజ్వానా సహాయంతో పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్మేవాడు.

సిద్దిపేటకు చెందిన రిజ్వానా నర్సింగ్ క్లినిక్ నిర్వహిస్తూ ఈ వ్యవహారాన్ని కొనసాగించేది. మూసాపేటకు చెందిన నర్సింహ రెడ్డి, పటాన్చెరువుకు చెందిన బాలరాజు కూడా ఈ ముఠాకు సహకరించేవారు. నాలుగు సంవత్సరాల క్రితం రాజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక బాబును కిడ్నాప్ చేసి 42 వేల రూపాయలకు అమ్మిన విషయమూ దర్యాప్తులో బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా నలుగురు పిల్లలను విక్రయించినట్టు, ఇటీవల లింగంపల్లి ప్రాంతం నుంచి అఖిల్‌ను కిడ్నాప్ చేసినట్టు తేలింది.

దర్యాప్తులో పటాన్‌చేరు ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను కూడా ఈ గ్యాంగ్ ద్వారా అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఆరుగురు చిన్నారులు అఖిల్ (5), అరుణ్ (2), అమ్ములు (8 నెలలు), లాస్య (5) తల్లిదండ్రులను ఇంకా గుర్తించలేదని, అద్విక్ (2), ప్రియా (1) లను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాపాడిన పిల్లలను జిల్లా బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని పిల్లల కిడ్నాప్ ముఠాను పట్టుకున్న ఎసిపి, సిఐ, ఎస్ఐలను ఈ సందర్భంగా డీసీపీ వినీత్ అభినందించారు.