19-05-2025 07:18:35 PM
నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి(Sri Anjaneya Swamy) వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సమేతంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, లోక్సభ సభ్యులు మల్లు రవి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.