02-05-2025 08:17:14 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): వేసవి కాలంలో వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమయితే తప్ప బయటికి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడ దెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడ దెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవిలో చేయవలసినవి, చేయకూడనివి కరపత్రాల రూపంలో ప్రచారం సాగించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా గ్రామాల్లో పాటల రూపంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
వేసవి కాలంలో ప్రజలు చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలని, బయటికి వెళ్ళడం అత్యవసరం అయితే గొడుగు లేదా టోపీ, తలపాగా కట్టుకోవాలని తెలిపారు. ఎండలో తేలికపాటి శారీరక శ్రమకు మాత్రమే హాజరు కావాలన్నారు. ఉప్పుతో గల మజ్జిగ లేదా గ్లూకోజ్ నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ద్రవ పదార్థాలు, పండ్లరసాలు తీసుకోవడం జరగాలని తెలిపారు. వడ దెబ్బకు గురైన వ్యక్తులను చల్లని ప్రదేశాలకు తరలించాలని, వేడితో బాధపడుతున్న వారికి వదులు దుస్తులు ధరించాలని అన్నారు. వడ దెబ్బ సోకిన వారు తీవ్రంగా ఉంటే వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని అన్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉండాలని, నలుపు, సింథటిక్, మంద పాటి దుస్తులను వినియోగించకూడదని తెలిపారు. వేసవిలో ఉప్పు కలిపిన ద్రావణం ను ఎక్కువగా తీసుకోవాలని, నివసించే గదుల్లోకి వేడి గాలి సోకకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.