25-07-2025 07:16:59 PM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్,(విజయ క్రాంతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. తరవాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించడమే కాకుండా, బోర్డుపై రాయించి వారి బోధన స్థాయిని అంచనా వేశారు.
అనంతరం పాఠశాల కిచెన్ను పరిశీలించి, వంటగదిలో శుభ్రత, ఆహార నాణ్యత ను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని ప్రశ్నిస్తూ తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.