calender_icon.png 19 August, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

19-08-2025 05:35:56 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏఆర్ నగర్ లో పర్యటించారు. గత సంవత్సరం ఇక్కడి నుండి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోధైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పరిస్థితులను పరిశీలించేందుకు ఆమె ఏ ఆర్ నగర్ లో పర్యటించారు. అయితే ఈ సంవత్సరం ఏ ఆర్ నగర్ నుండి ఇలాంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదు.  వార్డు లో పరిసరాలతో పాటు, మురికి కాలువలు, ఇండ్లను  జిల్లా కలెక్టర్ తిరిగి పరిశీలించారు.

ప్రజలు పాటిస్తున్న వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రతను గమనించారు.వార్డు లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ఉండడం, పరిశుభ్రత లోపించడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే ఓపెన్ డ్రైనేజీ సిస్టం మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. మనుషులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావని చెప్పారు. వార్డులో నిర్వహిస్తున్న జ్వర సర్వే సందర్బంగా మలేరియా సిబ్బందితో మాట్లాడారు.

ఇప్పటివరకు నమోదైన జ్వర కేసులు,మలేరియా,టైఫాయిడ్,డెంగ్యూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు వచ్చారా? రక్తం నమూనాలు తీసుకున్నారా? అని ఇంటి యజమానుల ద్వారా అడిగి తెలుసుకున్నారు . వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల వంటివి రాకుండా తాగునీటిని కాచి చల్లార్చి వడపోసి తాగాలని, తాజా ఆహారాన్ని తినాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆమె వార్డు ప్రజలకు సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న మందులు, నమోదైన హై రిస్క్ కేసులు, ప్రసవ కేసుల నమోదు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీల ఈ డి డి కేసులు, క్యాలెండర్ ప్రకారం చికిత్స అందిస్తున్నది లేనిది పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైన్ వాడ వార్డులో జనాభా ఎక్కువగా ఉన్నందున ఇక్కడ మరో పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం అవసరం ఉంటుందని, అందువల్ల ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేందుకు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.