19-08-2025 10:47:44 PM
మందమర్రి,(విజయక్రాంతి): వర్షాల కారణంగా మందమర్రి మండలంలో దెబ్బతిన్న కల్వర్టులు, పొంగి పొర్లుతున్న వాగులను మంగళ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాలలో మురుగు కాలువలు, రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వాగులలో వరద ఉధృతిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, నది, చెరువులలో వర్షపు నీరు అధికంగా ఉన్నందున చేపల వేటకు వెళ్లకూడదని, వరద పరిస్థితులలో పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు టామ్ టామ్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మురుగునీటి కారణంగా దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి నిలువలను ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్, ఆయిల్ బాల్స్ పిచికారి చేసి దోమల వృద్దిని నిరోధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తాగునీటి కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించేందుకు క్లోరినేషన్ చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో మరో 24 గంటలు వర్ష సూచన ఉందని, జిల్లాలో దెబ్బతిన్న నివాస గృహాల వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించడం జరిగిందని, పొలాల్లో ఉన్న వరద నీరు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు తదితరులున్నారు.