21-06-2025 08:47:32 PM
పిడిఎస్ యూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి..
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు, కళాశాల బస్సులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నటువంటి బస్సులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని పీడీఎస్ యూ అధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ అధికారి ప్రకాష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సింహాద్రి మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులను బస్సుల్లో ఎక్కించి అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై జిల్లా రవాణా అధికారి చర్యలు తీసుకుని వెంటనే వాటి పర్మిషన్లను రద్దు చేయాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘ నాయకులు దూదిపాల ప్రవీణ్, మందడి శ్రీధర్, నవీన్ తదితరులు ఉన్నారు.