12-06-2025 01:43:58 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలతోనే కమిషన్ వేసిందని, ఆ కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలిచి తక్కువ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తాగు, సాగునీటి రంగాల అవసరం తీరేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారన్నారు.
కాళేశ్వరంపై ముందు నుంచి కాంగ్రెస్ విషం చిమ్ముతూనే వచ్చిందని, నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపడితే కేవలం 16 టీఎంసీల ప్రాజెక్టుతో లాభంలేదని ఉద్యమ సమయంలోనే చెప్పామన్నారు. అత్యంత వేగంగా ప్రాజెక్ట్ను పూర్తి చేసి సాగునీరందించామని, ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్నారు.