06-07-2025 04:52:30 PM
మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి(Former Municipal Chairperson Gaddam Indu Priya) తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంబంధం లేని కేసులో తన భర్త చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని వాపోయారు. 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
సోషల్మీడియా ద్వారా తప్పుడు ప్రచారం..
తమపై సోషల్ మీడియావేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని పేర్కొన్నారు.
శ్రీవారి వెంచర్కు తమకు సంబంధం లేదు..
మూడు రోజుల నుంచి ప్రోబెల్స్ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్కు ముడి పెడుతున్నారని, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని గడ్డం ఇందుప్రియ అన్నారు. శ్రీవారి వెంచర్లో తన భర్తకు గుంట భూమి కూడా లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటి నుంచి వెళ్లాడని, 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఫోన్ వస్తే వెళ్లానని పేర్కొన్నారు.
ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్లా..?
తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అరెస్ట్ చేశారని ఇందుప్రియ తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ వద్ద తన భర్త చంద్రశేఖర్ రెడ్డి నీ రిమాండ్ చేశారని వివరించారు. అక్కడి నుంచి నిజామాబాద్ సారంగపూర్ జైలుకు తరలించారని తెలిపారు. శ్రీవారి వెంచర్ను 2023లోనే విభూస్ ఎకో టౌన్ షిప్ వారికి డెవలప్మెంట్కు లీజ్ అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. తన భర్తను అరెస్ట్ చేయడానికి ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. చట్టంపై తమకు నమ్మకం ఉందన్నారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.