06-07-2025 05:01:15 PM
సర్వే నెంబర్ 334లో ప్రభుత్వ స్థలం కబ్జా..
కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం దురాక్రమణ..
చర్యలకు దూరంగా రెవెన్యూ అధికారులు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను కాపాడాలని హైడ్రాను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు నగరంలో చాలా వరకు ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడుతూ వచ్చింది. కానీ కొందరు మాత్రం హైడ్రా అంటే ఏమాత్రం భయం లేకుండా ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు గదులు నిర్మిస్తూ తమ వశం చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందిన సరే చర్యలు తీసుకుంటామని నోటిమాటగా చెప్పడం తప్పా చర్యలు తీసుకోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే... బాచుపల్లి మండలం(Bachupally Mandal) నిజాంపేట్ లో జర్నలిస్ట్ కాలనీ సర్వే నెంబర్ 334 లోనీ సుమారు 100 చదరపు గజాల స్థలం కాలనీ అసోసియేషన్ కు సంబంధించిన స్థలం ఉంది.
ఈ స్థలం ప్రస్తుతం ఓ వ్యక్తి కబ్జా చేస్తూ తాను గ్రామస్తుడని తనదే ఈ స్థలం అంటూ రెచ్చిపోతూ కాలనీలో ఖాళీ స్థలాలు ఎక్కడ కనబడిన తనదే పై చేయిగా నిలిపాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా పలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై పలు మార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వినియోగాలకు వాడాల్సిన ప్రభుత్వ స్థలాలను అధికారుల పరోక్ష సహకారంతో కబ్జా చేస్తూ గదులు నిర్మిస్తున్నారు. అయితే వీటి వెనుక రెవెన్యూ అధికారుల సహకారం పటిష్టంగా ఉందంటూ ఆరోపణలు లేకపోలేదు.
అయితే నిజాంపేట్ ఆర్ఐ భాను చందర్(RI Bhanu Chander)ను విజయక్రాంతి ప్రతినిధి వివరణ కోరగా... ఇంతకు ముందు అక్కడ షెడ్డు ఉండేది. ఇప్పుడు గది నిర్మించారని బదులిచ్చారు. కానీ వాటిపై చర్యలు తీసుకుంటామని మాత్రం అనడం లేదు. కబ్జారాయుళ్లకు రెవెన్యూ అధికారులు ఎంతలా సహకరిస్తున్నారో ఆర్ఐ వివరణ ఇవ్వడంలోనే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇకనైనా ఉన్నతాధికారులు కలుగజేసుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, అలాగే కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.