19-06-2025 06:00:06 PM
బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి..
చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి..
బండారుపల్లి మోడల్ స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ఆవిష్కరణ..
మంత్రి సీతక్క..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలో నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించడం జరుగుతుందని, విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటూనే చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Danasari Anasuya Seethakka) అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లిలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్(District Collector Divakara TS), గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... గత సంవత్సరం పలు కంపెనీల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు త్వరగతిన ఇంగ్లీష్ రావడానికి కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయని, ప్రతి ఒక్కరికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం లేని పక్షంలో అంత వృధా అవుతుందని, రానున్న రోజులలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ములుగు లాంటి గిరిజన ప్రాంతంలోని విద్యార్దులు చదువులో బాగా రానిస్తూనే పాఠశాల స్థాయి నుండే సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకొని, అభివృద్ధి చెందిన ఇతర ప్రాంతాల విద్యార్దులకు ధీటుగా ఉన్నత స్థానంలో స్థిరపడాలని అన్నారు.