20-12-2025 05:42:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ అభినాష్ అభినవ్ ను అన్ని మండలాల ఎంపీడీవోలు శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అభినందించారు. ఎంపీడీవోలు పుష్పగుచ్చాలను అందిస్తూ, శాలువులతో సన్మానించారు. అలాగే, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను కూడా ఎంపీడీవోలు శాలువాతో సన్మానించారు.
మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎంపీడీవోలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహం గొప్పదని, కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని వారు అభిప్రాయపడ్డారు. అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎంపీడీవోలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు లక్ష్మీకాంత్, గజానన్, నీరజ్ కుమార్, రాధ, అరుణ, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.