20-12-2025 06:39:44 PM
మోతే,(విజయ క్రాంతి): యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని మోతే మండల వ్యవసాయ అధికారి అరుణ తెలిపారు. శనివారం మోతే మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రైతులు వారికి అవసరమైన యూరియాను ఈరోజు నుండి ఆన్లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకోని యూరియా తెచ్చుకోవచ్చు అన్నారు.
రైతులకు వారికున్న సాగుభూమి ప్రకారం యూరియా అందించడం జరుగుతుందన్నారు. కౌలు రైతులు భూమి యజమాని వివరాలు నమోదు చేసి తద్వారా యూరియాను పొందొచ్చు అన్నారు. రైతులు తమ ఇంటి నుంచి మొబైల్ లో యాప్ ద్వారా తమకు కావాల్సిన యూరియాను బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. రైతులు యాప్ లో తమకు నచ్చిన డీలర్ ని ఎంచుకొని బుక్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ ఐడి ఆ ఐడి తో పాటు రైతు పాస్ బుక్, ఆధార్, తీసుకొని బుక్ చేసుకున్న డీలర్ దగ్గరకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు అని అన్నారు.
మొబైల్లో ప్లే స్టోర్ నుంచి యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లో రైతు పాస్ బుక్కు నెంబర్ నమోదు చేస్తే ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుందన్నారు. దీనిని నమోదు చేసిన తరువాత రైతుల భూమి విస్తీర్ణం పంటల సాగు వివరాల ఆధారంగా ఎన్ని బస్తాలు యూరియా బుక్ చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది. యూరియా బుకింగ్ లో ఏమైనా సమస్యలు ఉన్న, సందేహాలు ఉన్న స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.