15-05-2025 01:27:23 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, మే 14 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను తీసుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. టేకుమట్ల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మాసంపెల్లి లింగాజి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సన్నాహక సమావేశం అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 20 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.11,50,500 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.