21-11-2025 07:23:37 PM
- మాజీ డిప్యూటీ మేయర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్
కరీంనగర్,(విజయక్రాంతి): నగరపాలక సంస్థలో పాలకవర్గం లేక, ప్రత్యేక అధికారుల పాలనలోనూ అవినీతి హెచ్చరిల్లిపోతుందని మాజీ డిప్యూటీ మేయర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ద్వారా విడుదల చేసిన 30 లక్షల నిధులు, బల్దియాకు ప్రత్యేక అధికారినిగా ఉన్నా కలెక్టర్ హయాంలో గోల్మాల్ కావడం ఏమిటని ప్రశ్నించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ వాల్పెయింటింగ్లు వేయకుండా, హోర్డింగ్స్ ఏర్పాటు చేయకుండా, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా, కొంతమంది బల్దియా అధికారులు, ఉన్నతాధికారులను చేతుల్లో పెట్టుకొని రూ.30 లక్షల అవినీతి బాగోతానికి తెరలేపారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో కేంద్ర ప్రభు త్వం స్వచ్ఛసర్వేక్షణ్ అమలులో ఇలాంటి అవినీతి అధికారుల పనితీరుతో కరీంనగర్ ర్యాంక్ పడిపోయిందన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి స్వచ్ఛ సర్వేక్షన్ నిధుల గోల్ మాల్ పై విచారణ అధికారిని నియమించి లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి కి పాల్పడిన అధికారిని గుర్తించి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.