14-09-2025 06:01:29 PM
చిట్యాల,(విజయక్రాంతి): శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం భూములను పరిరక్షించాలని ఈనెల 18న నల్గొండ కలెక్టరేట్ ముందు దీక్షకు పూనుకుంటున్నామని ఆదివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ తెలిపారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 201,201/ప1/1,201ప/1/2 లలో 102 ఎకరాల దేవాలయ భూమిని పరిరక్షించాలని గత కొన్ని నెలలుగా రెవిన్యూ, దేవాదాయ అధికారులకు, జిల్లా కలెక్టర్ కి పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ప్రైవేట్ పరిశ్రమ, వెంచర్ లకు అవసరమైన తారు రోడ్డు మార్గాన్ని 100 ఫీట్ల వెడల్పుతో దేవాలయ భూముల నుండి ప్రైవేటు వ్యక్తులు పనులు చేపడుతున్నారని, ఆ పనులను తక్షణమే నిలిపివేసి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేవాలయ భూమికి నాలుగు వైపులా హద్దులు నిర్ణయించి, కంచెను ఏర్పాటు చేయాలని కోట్లాది రూపాయల విలువ చేసే దేవాలయ భూములను పరిరక్షించాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న దేవాదాయ, రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్ల తో సెప్టెంబర్ 18 న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు దీక్షను చేపట్టబోతున్నామని, ఈ యొక్క దీక్షను పార్టీలకు అతీతంగా దేవాలయ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల వశం కాకుండా కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ తెలిపారు.