13-01-2026 12:00:00 AM
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ కార్యక్రమం
ఇనుగుర్తి శ్రీనివాసా చారి.ఎస్ఈ వెల్లడించారు
ఖమ్మం టౌన్, జనవరి 12 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక , విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా గృహ జ్యోతి లబ్ధిదారులకు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశ లేఖలను అందజేస్తున్నట్లు . ఇనుగుర్తి శ్రీనివాసాచారి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు.వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను టిజిఎన్పీడీసీఎల్ అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 52,82,498 మంది గృహ జ్యోతి లబ్దిదారులు , 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నేరుగా లేఖలను అందచేస్తున్నామని పేర్కొన్నారు . వినియోగదారులు మరియు అధికారుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం, భవిష్యత్తులో మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎస్ఈ వివరించారు.తమ పేరుతో నేరుగా ఉప ముఖ్యమంత్రి గారి నుండి శుభాకాంక్షల లేఖ అందడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ, ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.వీవీ పాలెం లో సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు.