08-09-2025 05:11:23 PM
నిర్మల్,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జుమ్మేరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు అధికారులకు స్వాగతం పలికారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. విద్య వల్ల మనిషి ప్రయోజకుడిగా మారుతాడని వివరించారు.
విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని తెలిపారు. పలు నీతి కథల ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపారు. అనంతరం వారోత్సవ కార్యక్రమాలలో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసి, బహుమతులను అందజేశారు.