18-11-2025 05:48:38 PM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక పద్ధతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ, విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు,, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించేందుకు అవసరమైన పనులు గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించి, పనులను ఎంపిక చేయాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టవలసిన పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో మౌళిక వసతులు, త్రాగునీరు, బాలబాలికలకు ప్రత్యేక మూత్రశాలల నిర్మాణాలు, భవన మరమ్మత్తులు, బ్లాక్ బోర్డులు, ఫ్యాన్లు ఏర్పాటు వంటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలు, భవనాల నిర్మాణాలు, వసతుల కల్పన పనులు త్వరగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, విద్యా శాఖ అధికారులు, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.